Telangana CM KCR Kalvakuntla Sobha : తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కులు చెల్లించుకుని.. తోమాలాసేవలో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి శోభ తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి సేవ అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వారు శ్రీకాళహస్తికి వెళ్లారు. శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంవద్ద వారికి అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసీఆర్ సతీమణి, కుటుంబ సభ్యులకు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించారు.
Read Also : America : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికా న్యూజెర్సీలో ప్రారంభం
ఇదిలాఉంటే తిరుమల స్వామివారి దర్శనంకోసం కల్వకుంట్ల శోభ, పలువురు కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సతీమణికి టీటీడీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన వారు.. మంగళవారం ఉదయం అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, కేసీఆర్ ఆరోగ్యం కుదటపడినట్లు తెలిసింది. సోమవారం ఎన్నికల షెడ్యూల్ కూడా రావటంతో ఈనెల 15 నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల రణరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారిని సోమవారం 68,828 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.53 కోట్లు వచ్చింది. ఐదు కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.