ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే మరో పదేళ్ల సమయమైనా పడుతుందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పయ్యావుల కేశవ్ మాట్లాడారు. శాసనసభకు వచ్చి చర్చించాలని వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని చెప్పారు.
అంతేగానీ, సింగిల్ కెమెరాతో మీడియా సమావేశాలు పెట్టడానికి కాదని అన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వారే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని చెప్పారు. జగన్ తీరు మారకపోతే వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో మిగలరని అన్నారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసమే ఢిల్లీ వెళ్లానని జగన్ ధైర్యంగా చెప్పొచ్చు కదా అని నిలదీశారు.
ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని చెప్పారు. శాసనసభలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నారని విమర్శించారు. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్లని తెలిపారు. ఏపీలో ఈ నిమిషం వరకూ జగన్ వేసిన పోలీసులే ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు.