YS sharmila: కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్.. ఎప్పుడంటే?
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల (YS sharmila ) క్లారిటీ ఇచ్చారు.

YS sharmila
YS sharmila son YS Raja Reddy political entry : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్కు తల్లి వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లారు. అక్కడి రైతులను పరామర్శించి ఉల్లి ధర, తదితర వివరాలను తెలుసుకున్నారు. దీంతో రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే, తన కొడుకు పొలిటికల్ ఎంట్రీపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల స్పందించారు. అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి తప్పకుండా అడుగు పెడతారంటూ షర్మిల చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాల్లోకి త్వరలో వైఎస్ రాజారెడ్డి ఎంట్రీ ఖాయమని షర్మిల స్పష్టత ఇచ్చారు.
కొడుకు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్కు వెళ్లిన వైఎస్ షర్మిల.. అక్కడ ఉల్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్వింటా ఉల్లి రూ.600 ధర కూడా పలకడం లేదు.. గత సంవత్సరం క్వింటా ఉల్లి రూ.4,500 ఉందని చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా రూ.1200కు కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. అయితే, రైతులు రూ.600 వందలకే ఎందుకు అమ్ముకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలంటూ షర్మిల అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటా ఉల్లిని రూ.2,400 కు కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.