పోలవరం ప్రాజెక్ట్.. పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు ఏంటి?

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది.

పోలవరం ప్రాజెక్ట్.. పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, అందుబాటులోకి వస్తే ప్రయోజనాలు ఏంటి?

Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్‌లో కేంద్రం హామీ ఇవ్వడం.. ఇటు తొలి దశ నిర్మాణానికి 12 వేల కోట్ల పెండింగ్‌ నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్‌ పెంచింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి..? ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి..? ఇక చేయాల్సిందేంటి..? దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా క్లారిటీ వచ్చింది. దీంతో పనుల్లో వేగం పెంచి.. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం.

అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిపించిన ఏపీ ప్రభుత్వం..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి పెట్టారు. గత ఐదేళ్లుగా ప్రాజెక్టుకు ఏర్పడ్డ అవాంతరాలను తొలగించుకుంటూ నిర్మాణాన్ని వేగం పెంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి కేంద్రం నుంచి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ప్రాజెక్ట్‌ పనులు స్పీడందుకోనున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆపై అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం డ్యామ్ సైట్ ను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిచింది ప్రభుత్వం. అమెరికా నుంచి జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి.పాల్‌, కెనడా నుంచి సీన్ హించ్‌బర్గర్, రిచర్డ్ డోన్నెల్లీ ఈ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నలుగురూ సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్మాణరంగ నిపుణులు.

సమస్యలు, పరిష్కారాలపై సమగ్ర నివేదిక..
పోలవరం డిజైన్‌, ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌, ఇతర నీటిపారుదల అధికారులు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ సాయిల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రాజెక్టు డిజైన్‌కి సంబంధించిన వివరాలు, ఇతర డాక్యుమెంట్లు అన్నీ ఈ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ పరిశీలించింది. జెట్ గ్రౌంటింగ్‌, సీపేజ్‌లపై రిపోర్ట్‌ను కూడా ప్రత్యేకంగా తయారు చేసింది. అలాగే డయాఫ్రమ్ వాల్‌ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కగట్టింది. ప్రాజెక్ట్‌ నిర్మించిన కంపెనీలతో మాట్లాడి గ్రౌండ్‌ రియాలిటీ ఏంటో అర్థం చేసుకుని.. ఎక్కడ తప్పులు జరిగాయి. వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేదానిపై సమగ్ర నివేదిక తయారు చేశారు. దాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించారు.

డయాఫ్రమ్ వాల్, రింగ్ ఫెన్సింగ్.. ఏది మేలు?
ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అప్పర్ కాపర్ డ్యామ్‌లో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్‌గా ఉండబోతోంది. మెయిన్ డ్యామ్‌లో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో రింగ్‌ ఫెన్సింగ్‌ చేస్తే సరిపోతుందని మొదట కమిటీ నివేదిక ఇచ్చింది. దీనికి సమాంతరంగా మరో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించడం ఉత్తమమని కూడా మరో నివేదిక ఇచ్చింది. ఏం చేస్తే ప్రాజెక్ట్‌ శాశ్వతంగా , డ్యామేజ్‌కు ఆస్కారం కాకుండా ఉంటుందనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

1941 నుంచే పోలవరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన..
1941 నుంచే పోలవరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంది. కొన్ని దశాబ్దాలు ఆ కల కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2004లో ప్రాజెక్ట్‌ మొదలైంది. రెండు దశాబ్దాలు గడిచాయి. ఇంకా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఉంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులతో పాటు ముంపు ప్రాంతాలు పెద్ద అడ్డంకిగా మారాయి. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో దానికి పరిష్కారం దొరికింది. కానీ.. భూసేకరణ , పునరావాసం, బాధితులకు నష్టపరిహారం రూపంలో అంచనా వ్యయం అమాంతం రెట్టింపు అయిపోయింది.

కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలంటే దాదాపు వెయ్యి కోట్లు అదనపు ఖర్చు..
ఇప్పటికి 72 శాతం ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయాలంటే 436 కోట్లు ఖర్చవుతుంది. కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలంటే దాదాపు వెయ్యి కోట్లు అదనపు ఖర్చు. ఏ విధంగా చూసినా దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతే కాదు రెండు నుంచి నాలుగు సీజన్ల సమయం కూడా వృధా అవుతుంది. దీనికి తోడు 2019 తర్వాత కాంట్రాక్టర్లను మార్చడంతో హెడ్‌ వర్క్స్‌ నిలిచిపోయాయి. అప్పర్‌, లోయర్‌ కాఫర్‌ డ్యాంలు దెబ్బతిన్నాయి. గైడ్‌ బండ్‌ దెబ్బతినడంతో విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కూడా ఆగిపోయింది. అటు ఏళ్లు గడవటం, ఇటు అంచనా వ్యయం పెరగడం, వరదలు ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్‌ కొంత దెబ్బతినడంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు సహా కొత్త పనులను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. 2014-2019 మధ్య దాదాపు 11 వేల 5వందల కోట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. 24 గంటల్లో 32 వేల 315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్‌ రికార్డుకెక్కిన ఘనత కూడా ఆ ప్రాజెక్టుకు ఉంది.

7లక్షల 20వేల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల 50 వేల మందికి తాగునీరు..
పోలవరంలో డయాఫ్రం వాల్ డెప్త్ 90 మీటర్లు. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో అతి భారీ గేట్లు ఉంటాయి. 390 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాల్వలతో నిర్మాణపరంగా ఈ ప్రాజెక్ట్ అతి పెద్దది. ప్రాజెక్ట్‌ పూర్తయితే దాదాపు 7లక్షల 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 28 లక్షల 50 వేల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయి. అంతేకాదు, పోలవరం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చు. వాటర్ టూరిజం కూడా సాధ్యపడుతుంది. పరిశ్రమలకు నీటి కొరత అనే సమస్యే ఉండదు. వరదల కారణంగా ఏటా ఏపీకి ఎంతో నష్టం కలుగుతోంది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఆ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ ప్రాజెక్టు సాయంతో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని పక్కకు మళ్లించవచ్చు.

ఏపీ మొత్తానికి సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుతాయి..
పోలవరం పూర్తయితే లెఫ్ట్‌ కెనాల్‌, రైట్‌ కెనాల్‌ ద్వారా దాదాపు ఏపీ మొత్తానికి సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుతాయి. అటు ఉత్తరాంధ్రలోని విశాఖ , ఉభయగోదావరి, కృష్ణా, ఇటు రాయలసీమకు కూడా నీటిని అందించే అవకాశముంటుంది. ఇలా వరదల సమయంలో సముద్రంపాలయ్యే 3 వేల టీఎంసీల నీటిని ఒడిసిపడితే రాష్ట్రం కరువురహితంగా మారి.. సస్యశ్యామలమవుతుంది. ఇది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం.

వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేయాలని గట్టి పట్టుదల..
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీతో పాటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అనుమతులు, నిధులు రాబట్టడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు కేంద్రం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని ప్రకటించడంతో రాష్ట్ర సర్కార్‌ ప్రాజెక్ట్‌ పనుల్ని మరింత వేగం చేయాలనుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ.. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమించనుంది. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంది ఏపీ సర్కార్‌.

 

Also Read : నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?