Payyavula Keshav (1)
Sand Transported Neighboring States : రాయలసీమ వనరులను జగన్ ప్రభుత్వం ఏటీఏంలా వాడుకుంటోందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాయలసీమను అవినీతి కోసం, దోపిడీ కోసం జగన్ ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఆరోపించారు. వైసీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూముల బాగోతం అసెంబ్లీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసన్నారు.
పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ. 900 కోట్లు భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ప్రభుత్వ మౌనం స్కాం జరిగిందన్న తన ఆరోపణలకు అంగీకారంగా భావించాలా అని అడిగారు. పక్కదారి పట్టిన రూ. 900 కోట్లు వినియోగిస్తే.. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని తెలిపారు.
కొట్టుకు పోయిన అన్నమయ్య, పులిచింతల గేట్లు బిగించ గలిగేవారని వెల్లడించారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని చెప్పారు. హంద్రీ-నీవా, హెచ్చెల్సీ, గాలేరు-నగరి ప్రాజెక్టులు ముందుకెళ్లలేదన్నారు. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 300 కోట్ల దోపిడీ యధేచ్ఛగా జరిగిందని ఆరోపించారు.
తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము రూ. 12 వేల కోట్లు చేరాయని పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో సామాన్యునికి ఇసుక దొరకడం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలకు భారీగా ఇసుక అక్రమంగా తరలింపు జరుగుతోందని విమర్శించారు.