Corona Lockdown : చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు.
చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2వేల 291 కొత్త కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1.85లక్షల మందికి పైగా కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో 1.63లక్షల మందికి పైగా కోలుకోగా.. 1,254మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20వేల 810 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కట్టడి కోసం ఏపీ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరుకుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకూడదు. అత్యవసరం అయితే తప్ప ఇంటి గడప దాటకూడదు. ఏవైనా పనులుంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి.