KA Paul Pawan Kalyan
KA Paul – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందా? అంటే అవుననే అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ముప్పు పొంచి ఉందన్నారు కేఏ పాల్. తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, కొడుకుని ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు ఏదైనా చేయడానికి తెగిస్తారని కేఏ పాల్ అన్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కేఏ పాల్ స్పందించారు. తాజాగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పవన్ కు ప్రాణహాని ఉంది అంటూ అందులో బాంబు పేల్చారు కేఏ పాల్.
” పవన్ కల్యాణ్ కి నేను ఇచ్చే సలహా ఇదే. ఈ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ఫస్ట్ అనౌన్స్ చేయాల్సింది ఏంటంటే.. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ యాత్ర చేస్తున్నాను అని చెప్పాలి. లేదంటే.. పవన్ యాత్రకు ఎవరూ మద్దతు పలకొద్దు. అంతా ఆలోచించండి. ఇంతవరకు ఒక్క బీసీ, కాపు సీఎం కాలేదు. నేను సీఎం అభ్యర్థిని కాను, కేవలం జగన్ ను గద్దె దించడానికి, చంద్రబాబుని గెలిపించడానికే నేను వచ్చాను అని పవన్ అంటే.. ఆయనను ఎవరూ నమ్మొద్దు.
Also Read..Adapa Seshu: కాపులను మోసం చేయడానికే పవన్ వారాహి యాత్ర.. అంతా కలిసి కుట్ర చేస్తున్నారు
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ, చంద్రబాబు. తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ, కేసీఆర్. స్వార్ధ రాజకీయాలకు పవన్ కల్యాణ్ స్వస్తి పలకాలి. లేదంటే చాలా డేంజర్ ఒకటి ఉంది. ఎన్టీ రామారావు బతికుండగానే చంపించిన చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారు. బాలయోగి, లాల్ చంద్ బాషా, ఎర్రన్నాయుడు లాంటి టీడీపీ మహా నాయకులు నేడు బతికి లేరంటే అర్థం చేసుకోవాలి.
పవన్ కి ప్రాణహాని కూడా ఉందని నేను చెబుతున్నా. ఎందుకంటే తన స్వార్ధ రాజకీయం కోసం ఏదైనా చేయడానికి చంద్రబాబు తెగిస్తారు. సింపతీ ఓట్లు కావాలని చంద్రబాబే మరొకరి ద్వారా పవన్ ను చంపించేసి ఆ నేరాన్ని జగన్ పై నెట్టేసి మోసం చేసినా చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తన కొడుకు లోకేశ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు ఎంతదూరమైనా వెళ్తారు. ఈ విషయం పవన్ కు తెలుసు. తెలియని వారు తెలుసుకోండి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.