pawan and lokesh
Lokesh Nara- Pawan Kalyan : అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ సరిహద్దు నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని జనసైనికులు తొలగించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ – హైదరాబాద్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గరికపాడు వద్ద రోడ్డుపై పవన్ బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పవన్ నడుచుకుంటూ కొద్దిదూరం ముందుకెళ్లారు. దీంతో పోలీసులు పవన్ వాహనంలో ముందుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
Chandrababu Naidu Arrest: ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు
మళ్లీ అనుమంచిపల్లి దగ్గర పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడుగడుగునా తనను అడ్డుకోవటంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి రావాలంటే వీసా పాస్పోర్ట్ కావాలేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక విమానంలో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు, కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు.. విశాఖలో కూడా ఇలాగే చేశారు.. ఏం చేయాలి అంటూ పవన్ తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ‘పవన్ను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ కారణం లేకుండా, పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డెక్కి అడ్డంపడి పవన్ కళ్యాణ్ను కదలనివ్వకుండా చేయడం దారుణం. రాజకీయ నేతలని అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అంటూ నారా లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.