CM Jagan On Teachers : టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది అంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు సీఎం జగన్. పేదలు మంచి చదువులు చదవాలన్నదే సంస్కరణల లక్ష్యం అన్న జగన్.. అందుకోసమే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డు రాకూడదన్న సీఎం జగన్.. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జగన్. గత ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసిందన్నారు.
టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం కుట్రలు చేస్తోంది. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నాం. పేదలు కూడా మంచి చదువులు చదవాలనేదే మా లక్ష్యం. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఎవరూ అడగకుండానే ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులను కల్పించాం.
విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలను నిర్వహించా. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉపాధ్యాయులదే. సాన పట్టకపోతే వజ్రం కూడా రాయితోనే సమానం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో అనేక చర్యలను చేపట్టాం. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులోకి రావాలి. గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పేదలకు విద్యను దూరం చేశాయి” అని జగన్ అన్నారు.
ఈ సందర్భంగా సమాజంలో ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరించారు సీఎం జగన్. ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడని జగన్ చెప్పారు. గ్రామంతో మొదలుపెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకురాగలుగుతాడని ఉపాధ్యాయులను కీర్తించారు. తన కన్న పిల్లల కోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలు కూడా బాగుపడాలని టీచర్ ఆరాటపడతాడని జగన్ అన్నారు.
కాగా, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను సీఎం జగన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీచర్ల సన్మాన వేదికపై ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీచర్లకు అవార్డులు ఇస్తున్న సందర్భంగా, తన చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడి కళ్లద్దాలు కింద పడిపోయాయి. వెంటనే స్పందించిన జగన్ తానే స్వయంగా కిందకు వంగి మరీ ఆ కళ్లద్దాలను తన చేతులతో తీసి ఉపాధ్యాయుడికి అందజేశారు.
ఒక మంచి టీచర్ ఒక స్కూలును, ఒక వ్యవస్థను మార్చగలడు, గ్రామంతో మొదలుపెట్టి.. గొప్ప విప్లవాన్ని తీసుకురాగలుగుతాడు, తన కన్న పిల్లలకోసమే కాదు, తరగతిలో ఉన్న పిల్లలు కూడా బాగుపడాలని టీచర్ ఆరాటపడతాడు: సీఎం pic.twitter.com/URdNUemSJI
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 5, 2022