Ys Jagan Mohan Reddy : లద్దాఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశ రక్షణలో వారి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు.
కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణా రెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు జగన్. ఆయా కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగన్. మరణించిన జవాన్ల కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు వీరి అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని జగన్ ఆదేశించారు.
ప్రమాదంలో మరణించిన ముగ్గురు జవాన్ల మృతదేహాలు లడక్ ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. లద్ధాక్ లో నది దాటుతూ యుధ్ధ ట్యాంకర్ కొట్టుకుపోయిన ఘటనలో ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం చేవెండ్ర గ్రామానికి చెందిన సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా ఇస్లాంపూర్ చెందిన సుభాన్ ఖాన్, ప్రకాశం జిల్లాకు చెందిన యం.ఆర్.కే రెడ్డిలుగా గుర్తించారు. వివిధ హోదాల ఆర్మీ అధికారులు జవాన్ల మృతదేహాలకు శ్రద్ధాంజలి ఘటించారు. ముగ్గురు జవాన్ల మృతదేహాలకు ఆర్మీ బెటాలియన్ తో గౌరవ వందనం పలికారు. అనంతరం ఆర్మీ వెహికల్ లో వారి వారి నివాసాలకు మృతదేహాలు పంపించారు ఆర్మీ అధికారులు.
Also Read : కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది.. వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం, ఒళ్లు గగుర్పొడిచే వీడియో