TDP Chief Chandrababu Naidu :టీడీపీ (TDP) మళ్లీ ఎన్డీయే (NDA) కూటమిలో చేరుతుందని ఇటీవల విస్తృత ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కొద్ది నెలల క్రితం ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda), కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీకావటంతో టీడీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్డీయేలో చేరే అంశంపై చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్ ను విడుదల చేసిన విషయం విధితమే. అనంతరం ఏఎన్ఐతో మాట్లాడుతూ ఎన్డీయేలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చారు.
Chandrababu : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు మూడు రోజులు పర్యటన
ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరే అంశంపై సరియైన సమయంలో మాట్లాడతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడటం సరియైన సమయం కాదని అన్నారు. 2024లో జాతీయ రాజకీయాల్లో మా పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పారు. నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్. ఇది నా పెద్ద ఎజెండా. రాష్ట్ర పునరాభివృద్ధికి, పునర్నిర్మాణంకోసం నా కృషి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధానిని ప్లాన్ చేశాం. అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాల నిర్మాణాలు చేశాం. ప్రస్తుత సీఎం జగన్ అమరావతిలో నిర్మాణం చేసిన అసెంబ్లీలోనే కూర్చున్నారు. సచివాలయంలోనే కూర్చుకున్నారు. కేబినెట్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇది తాత్కాలికమా? గత పదేళ్లుగా అవి పనిచేస్తూనే ఉన్నాయి అని చంద్రబాబు అన్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం విధితమే. అయితే, 2019 ఎన్నికల సమయంకంటే ముందు 2018 వరకు ఎన్డీయే కూటమిలో కొనసాగుతూ వచ్చిన టీడీపీ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో విబేదించింది. ఈక్రమంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా టీడీపీ బరిలోకి దిగింది. కానీ, ఘోర ఓటమిని చవిచూసింది. అయితే, గత కొంతకాలంగా మళ్లీ టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై ఏ పార్టీ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. త్వరలో జరిగే ఎన్నికల సమయం నాటికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.