TDP Leader Narayana : ఏపీ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించింది. ఈ (బుధవారం) ఉదయం 5.45 గంటలకు బెయిల్ పై నారాయణ విడుదల అయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 10.50గంటలకు మాజీ మంత్రి నారాయణను చిత్తూరుకు తీసుకొచ్చారు పోలీసులు. సుమారుగా 30 నిమిషాల పాటు పోలీస్ శిక్షణా కేంద్రంలో నారాయణను విచారించారు.
అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నారాయణను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుమారుగా 40 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో నారాయణను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఇంట్లోనే రెండు గంటలకుపైగా విచారణ కొనసాగింది. మేజిస్ట్రేట్ వద్ద ఇరువర్గాల వాదనాలు కొనసాగాయి. మెజిస్ట్రేట్ వద్ద 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు ఆధారాలు చూపించారు.
నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా నారాయణ వైదొలిగినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కొన్ని డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని నారాయణ తరపు న్యాయవాదులు తెలిపారు.
బెయిల్ మంజూరును నారాయణ తరపు లాయర్లు ధ్రువీకరించారు. ఈరోజు ఉదయం 5.45 గంటలకు మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు అయింది. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చింది. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో పట్టణ స్టేషన్లో కేసు నమోదైంది.
Read Also : Narayana Arrest : నారాయణ అరెస్టును ధృవీకరించిన చిత్తూరు పోలీసులు