Roja Selvamani(Photo : Google)
Roja Selvamani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఓ రేంజ్ లో మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రాష్ట్రం కోసం ఎన్డీఏ మీటింగ్ లో ఏం అడగబోతున్నారు అని జర్నలిస్ట్ అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదు నాదెండ్ల మనోహర్ చెబుతారు అని పవన్ అంటారు. మరి పార్టీ పెట్టింది ఎందుకు? గాడిదలు కాయడానికా? అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
”చంద్రబాబుతో కలవద్దని చిరంజీవి చెప్పినందుకే మీ అధికార ప్రతినిధితో తిట్టించావు. పవన్ జీవితం చిరంజీవి పిక్చర్ అని జనసేన పార్టీ వాళ్లు తెలుసుకోవాలి. ఒక మాట మీద నిలబడవు, పార్టీ ఎందుకు పెట్టావో చెప్పలేవు. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. ప్రెస్ ముందు మరో మాట మాట్లాడతావ్.
ఇలాంటి వాడికి ఎవరైనా ఓటు వేస్తారా? అందుకే గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. పవన్ సినిమాలో హీరో కావచ్చేమో. రాజకీయాల్లో మాత్రం జీరో. జగనన్నని అనే అర్హత నీకు నీ పార్టీ వాళ్లకి లేదు. రాజకీయ, సినిమా భిక్ష పెట్టిన అన్న అంటే కూడా గౌరవం లేదు. ఫ్యాన్స్ అంటే గౌరవం లేదు. కులం అంటే గౌరవం లేదు. చివరికి తల్లి అంటే కూడా గౌరవం లేదు” అని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు రోజా.
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధిపై జిల్లా పరిషత్ కార్యాలయ సభ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంఛార్జ్ మంత్రి రోజా జనసేనానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.