Gautam Reddy Dead-march : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలోని ఆయన నివాసం నుండి ప్రత్యేక అంబులెన్స్ లో మేకపాటి భౌతిక కాయం ఉదయగిరికి బయలుదేరింది. ఆయనతోపాటు ఆయన సతీమణి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగన్నాయి. అంతిమ యాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరు కానున్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నేడు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని మేకపాటి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమేరకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ను సీఎం జగన్ నియమించారు. అదేవిధంగా జిల్లా మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను లోకల్గా ఏర్పాట్లు చూడవల్సిందిగా ఆదేశించారు.
సోమవారం ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్రెడ్డికి శ్వాస ఆడట్లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్కు గురయ్యారు. ఇటీవలే ఆయన దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్ను ప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. 1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు.