Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మాటలు తూటాలు పేలుతోన్న వేళ కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని చెప్పింది.
పెట్టుబడుల ప్రక్రియపై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై ఈ మేరకు తాము స్పష్టత ఇస్తున్నామని తెలిపింది. RINL పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రక్రియ పురోగతిలో ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు తొలుత నిధులు ఇచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో, ఈ ప్రతిపాదనల బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుండడంతో ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని పలు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ప్రైవేటీకరణ జరగడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ఉక్కు శాఖ స్పష్టతనిచ్చింది.