Janasena TDP Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేయడం ఏపీ పాలిటిక్స్ లో (Andhra Politics) సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే టీడీపీతో చేతులు కలపాల్సిందేనని.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని జనసేనాని అన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గురువారం మధ్యాహ్నం పవన్ కలిశారు. నందమూరి బాలకష్ణ, (Nandamuri Balakrishna) నారా లోకేశ్ తో (Nara Lokesh) కలిసి.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని క్లారిటీ ఇచ్చారు.
ఇక నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాటం కొనసాగిస్తాయని.. ఇందు కోసం రెండు పార్టీల నాయకులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని ఎదుర్కొలేమని, సమిష్టిగా ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఏపీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్న తన కోరికను వెల్లడించారు. తమతో కలిసి రావాలని బీజేపీని ఆయన కోరారు. తన విన్నపంపై బీజేపీ అధినాయకత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. అధికార వైసీపీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజ్ బంధం బయటపడిందని.. పవన్ కళ్యాణ్ పై భ్రమలు తొలగిపోయాయని వైసీపీ పేర్కొంది. టీడీపీ జనసేన పొత్తుపై స్పష్టత రావడంతో తర్వాత అడుగు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ క్రింది ప్రశ్నలు తలెత్తున్నాయి.
Also Read: పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయాలు ఎలా ఉంటాయి?
పవన్ కళ్యాణ్ నిర్ణయానికి బీజేపీ అధినాయకత్వం మద్దతు ఇస్తుందా?
పవన్ నిర్ణయంపై వైసీపీ నాయకత్వం ఏ స్థాయిలో స్పందించనుంది?
ఏపీలో నిజంగా రాజకీయ యుద్ధ వాతావరణం కనిపించనుందా?