ADANI Hindenburg Report : ఒక్క రిపోర్ట్.. ఒకే ఒక్క రిపోర్ట్.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల పునాదులను కదిలించింది. ఒక్క రోజులోనే.. 87 వేల కోట్ల సంపద ఆవిరయ్యేలా చేసింది. ఆ ఒక్క రిపోర్ట్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీని.. మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజార్చింది. ఇంతకీ.. హిండెన్బర్గ్ ఇచ్చిన ఆ రిపోర్టులో ఏముంది? ఈ పరిణామాల తర్వాత.. ఇన్వెస్టర్ల మదిలో మెదులుతున్న ప్రశ్నలేంటి?
గౌతమ్ అదానీ.. ఇండియాలో అంబానీ ఎంత ఫేమస్సో.. అదానీ కూడా అంతే పాపులర్. అంతేకాదు.. ఇప్పుడు.. అంబానీ కంటే ఓ మెట్టు ఎక్కువే. ప్రపంచ కుబేరుల్లో రెండు రోజుల క్రితం వరకూ మూడో స్థానంలో వెలిగారు అంబానీ.. దీనంతటికీ కారణం.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడవే కంపెనీలు.. అదానీ భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చబోతున్నాయా? హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత.. మార్కెట్లో నెలకొన్న అనుమానాలు, స్టాక్స్లో వస్తున్న మార్పులు చూస్తుంటే.. ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయ్. అపర కుబేరుడు అదానీకి చెందిన కంపెనీలన్ని.. అప్పుల కుప్పల్లా మారాయని.. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ.. హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ప్రమోటర్ల మార్కెట్ మ్యాజిక్తో.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్ల ధరలకు రెక్కలొచ్చి.. చుక్కల దాకా చేరాయ్. అవి.. ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని.. వాటిలో పెట్టుబడులు ఎంతమాత్రం మంచిది కాదని ఈ రిపోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది. దాంతో.. అదానీ కంపెనీల షేర్లన్నీ దెబ్బకు పడిపోయాయ్. గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో 87 వేల కోట్లు ఆవిరైపోయాయి.
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. స్టాక్ మ్యానిపులేషన్తో పాటు అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని.. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. సుమారు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుస్తున్నట్లు.. హిండెన్బర్గ్ రీసెర్చ్ 103 పేజీల సంచలన నివేదిక విడుదల చేసింది. లెడ్జర్ బుక్స్కి ఎప్పటికప్పుడు కొత్తగా మార్చేయడం, స్టాక్ మార్కెట్ మాయాజాలంతో.. ఎడాపెడా అప్పులు చేస్తూ నెట్టుకొస్తోందని అందులో తెలిపారు. ముఖ్యంగా.. తన ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు.. అదానీ గ్రూప్ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని.. షేర్ల రేట్లను కూడా ఊహించని విధంగా పెంచిందని చెబుతోంది హిండెన్బర్గ్. అంతేకాదు.. పెంచిన రేట్ల దగ్గర షేర్లను తాకట్టు పెట్టి.. ప్రమోటర్లు మరిన్ని అప్పులు చేస్తున్నారని రిపోర్టులో ఆరోపించింది. అంతేకాదు.. అదానీ గ్రూప్లోని ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర.. రాబోయే రోజుల్లో 85 శాతం పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Gangavaram Port : అదానీ గ్రూప్ ఆధీనంలోకి గంగవరం పోర్టు
గడిచిన మూడేళ్లలో.. అదానీ గ్రూప్ కంపెనీలు ఊహించని స్థాయిలో మార్కెట్లో ఎదిగాయి. ఇదే సమయంలో.. ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 819 శాతం పెరిగింది. ఇదే.. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని కూడా హిండెన్బర్గ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. ఈ సూపర్ డూపర్ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తం ఉందని ఆరోపించింది. అక్రమంగా షేర్ల ధరలు పెంచి, అధిక రేట్లకు.. దొరికిన చోటల్లా.. అదానీ గ్రూప్ అడ్డగోలుగా అప్పులు చేసినట్లు చెబుతోంది రిపోర్ట్. అదానీ గ్రూప్ 12 వేల కోట్ల డాలర్ల నెట్వర్త్లో.. 10 వేల కోట్ల డాలర్ల నెట్వర్త్.. గడిచిన మూడేళ్లలోనే సమకూరడంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయ్. గతేడాది మార్చి నాటికి.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అప్పు.. 2 లక్షల 20 వేల కోట్లు. అందులో 40 శాతం.. అంటే.. 88 వేల కోట్లు ఒక్క ఏడాదిలోనే పెరిగాయ్.
అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు.. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ రెండేళ్ల పాటు శ్రమించినట్లు చెబుతోంది. ఇందుకోసం.. ఆరు దేశాలకు పైగా సందర్శించి, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించింది. అంతేకాదు.. అదానీ గ్రూప్ కంపెనీల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులతోనూ మాట్లాడి.. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. కరీబియన్ దీవులు, సైప్రస్, మారిషస్, యుఏఈ లాంటి దేశాల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లకు, వారి కుటుంబసభ్యులకు అనేక షెల్ కంపెనీలు ఉన్నట్లు.. తమ ఇన్వెస్టిగేషన్లో తేలినట్లు చెబుతోంది హిండెన్బర్గ్. ప్రమోటర్ల అవినీతి, అక్రమ లావాదేవీలు, లిస్టెడ్ కంపెనీల లాభాలను దారి మళ్లించేందుకే.. డొల్ల కంపెనీలను వాడుకుంటున్నట్లు తేల్చింది. ఇదంతా.. ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదని.. కొన్ని దశాబ్దాలుగా ఇది కొనసాగుతుందని చెప్పింది హిండెన్బర్గ్.
Adani Group: అంబుజా, ఏసీసీ కంపెనీలకు అదానీ రూ.31,000 కోట్ల ఓపెన్ ఆఫర్
గతేడాది ఆగస్టులోనూ.. అదానీ గ్రూప్ అప్పుల కుప్ప అని.. తేడా కొడితే అంతా ఖల్లాస్ అని.. బిజినెస్ అనలిటిక్స్ సంస్థ అయిన క్రెడిట్ సైట్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు.. ఆ గ్రూపులోని వ్యాపారాల పరిస్థితిని వివరించింది. పోర్టుల నుంచి సిమెంట్ దాకా వివిధ వ్యాపారాల్లో విస్తరించిన అదానీ గ్రూప్.. అప్పటికే పరిధికి మించి అప్పులు చేసిందని.. క్రెడిట్ సైట్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఉన్న బిజినెస్లతో పాటు కొత్త వ్యాపారాల్లోనూ దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు.. అదానీ గ్రూప్.. అప్పుల మార్గాన్ని ఎంచుకుంటోందని.. రిపోర్టులో తెలిపింది. పరిస్థితులు దిగజారితే.. ఆ అప్పులే కంపెనీలకు ఉచ్చుగా మారొచ్చని కూడా హెచ్చరించింది. అలాంటి పరిస్థితే గనక తలెత్తితే.. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు డిఫాల్డ్ అయ్యే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టేసింది. ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్లో అంతకు మించిన వివరాలు బయటపడడంతో.. స్టాక్మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లు ఢమాల్ మన్నాయి.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగిల్చాయి.