Cryptocurrency Hacked: క్రిప్టోకరెన్సీపై ఇప్పుడిప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతున్న తరుణంలో.. అందులోని భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. డిజిటల్ వెబ్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించేందుకు అభివృద్ధి చేసుకున్న ఈ క్రిప్టోకరెన్సీనీ.. హ్యాకర్లు దోచుకోవడం ఆందోళనకు గురిచేస్తుంది. “Wormhole” అనే సంస్థ వెబ్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేసి $320 మిలియన్ డాలర్ల విలువైన 120,000 ఎథెరియం(wETH) కరెన్సీని హ్యాకర్లు కాజేశారు. క్రిప్టోకరెన్సీ అభివృద్ధిలోకి వచ్చాక జరిగిన నాలుగో అతిపెద్ద హ్యాకింగ్ గా విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లాక్ చైన్ సాంకేతికతతో ఎంతో భద్రత ఉంటుందని భావించిన క్రిప్టోకరెన్సీ తరచూ హ్యాకింగ్ కు గురవడం..ఈ వ్యవస్థపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది.
Also read: Husband For Sale: మొగుడ్ని వేలానికి పెట్టిన భార్య, కొనుకుంటామంటూ వచ్చిన 12 మంది మహిళలు
“Wormhole” సంస్థకు చెందిన సర్వర్ లో ఉన్న కొన్ని లోపాలను కనిపెట్టిన హ్యాకర్లు.. wETH టోకెన్లను మోసపూరితంగా సృష్టించగలిగారు, వాటిలో దాదాపు 94,000 టోకెన్లను ఎథెరియం బ్లాక్చెయిన్కు బదిలీ చేసి అనంతరం ఎథెరియం(wETH) కరెన్సీని దోచుకెళ్లారు. ఇది గమనించిన సదరు సంస్థ.. వెంటనే అప్రమత్తమై తమ సర్వర్ల నెట్వర్క్ ను పటిష్టం చేసింది. “Wormhole” అనేది వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుంది. దీనిద్వారా ఒక క్రిప్టో నెట్వర్క్ నుండి మరొక క్రిప్టో నెట్వర్క్కు లావాదేవీలు బదిలీ చేసుకోవచ్చు.
Also read: Hyderabad Traffic: “ఫ్రీ లెఫ్ట్”తో ట్రాఫిక్ సమస్యకు చెక్, త్వరలో ఇతర జుంక్షన్ల వద్ద అమలు
క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఈ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలోకి డబ్బును బదిలీ చేస్తుంటారు. తద్వారా క్రిప్టో కరెన్సీ కొనుగోలు, రుణాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటి పనులు చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడిపెడితే బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో.. డబ్బున్న కొందరు ఈ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థల్లో నగదు బదిలీ చేస్తున్నారు. అయితే ఆయా వ్యవస్థలను నిర్వహించే సర్వర్లలో సాంకేతిక లోపాల కారణంగా హ్యాకర్లు సునాయాసంగా ప్రవేశించి దోచుకుంటున్నారు.