Tirupati – Love Couple Suicide : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతులను బి కళ్యాణి (15), జె.యుగంధర్ (17) గా పోలీసులు గుర్తించారు.
చౌడేపల్లె మండలం జోగి కొత్త ఇండ్లకు చెందిన యుగంధర్, రామ సముద్రం మండలం చిట్టెం వారి పల్లికి చెందిన బోడి కళ్యాణి ప్రేమించుకున్నారు. అయితే, వారి ప్రేమకి ఇరువురి ఇళ్లల్లోని పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో ఈ నెల 18న ప్రేమికులు ఇంటి నుండి పరార్ అయ్యారు. ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కల్యాణి, యుగంధర్ ఇద్దరూ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కొంతకాలం ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, వారి ప్రేమ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లు నో చెప్పినా కల్యాణి, యుగంధర్ ప్రేమను కొనసాగించారు. తాము కలిసి బతకలేము అని నిర్ణయించుకున్నారో మరో కారణమో కానీ.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతే, పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలా అర్థారంతరంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం. ప్రేమ పేరుతో ఉరేసుకుని చనిపోవడం విషాదకరం. తీవ్ర నిర్ణయాలతో కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. పిల్లలే సర్వస్వంగా బతికే తల్లిదండ్రులు ఇలాంటివి తట్టుకోలేకపోతున్నారు. గుండె పగిలేలా రోదిస్తున్నారు. బాగా చదువుకుని ప్రయోజకుడిగా మారి తమకు అండగా ఉంటాడని, తమను మంచిగా చూసుకుంటాడని పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
Also Read..Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్
అయితే, కొంతమంది యువత ఇలా ఆత్మహత్య చేసుకుని వారి ఆశలను, కలలను కల్లలు చేస్తున్నారు. పిల్లలు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక బాధిత తల్లిదండ్రులు సైతం జీవితాంతం దుఖిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకోవాలి కాని.. ఇలా సూసైడ్ చేసుకోడం కరెక్ట్ కాదంటున్నారు. చావు సమస్యకు పరిష్కారం కానే కాదంటున్నారు.