Turkey and Syria Earthquake: టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించడం వల్ల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భూకంపం దాటికి భవనాలు కుప్పకూలాయి. వీటి శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 16న ఈ భారీ భూకంపం సంభవించింది. అప్పటి నుంచి నేటి వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం మృతుల సంఖ్య 50వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 44వేల మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Turkey Syria Earthquake : టర్కీ, సిరియాల్లో 34వేలకు చేరిన మృతుల సంఖ్య .. పెరుగుతున్న నేరాలు
శుక్రవారం రాత్రి వరకు వివరాల ప్రకారం.. టర్కీలో 44,218 మంది భూకంపం దాటికి మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సిరియాలో 5,194 మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో మృతుల సంఖ్య 50వేలు దాటింది. ఐక్యరాజ్య సమితి అధికారులు భూకంపం సంభవించిన కొద్దిరోజులకే మృతుల సంఖ్య 50వేలు దాటుతుందని అంచనా వేశారు. మరోవైపు ప్రతీరోజూ టర్కీ, సిరియా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటే జంకుతున్నారు. గడ్డకట్టే చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడారాల్లో తలదాచుకుంటున్నారు.
భూకంపం వల్ల 1.60లక్షల భవనాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ మాట్లాడుతూ.. ఒక సంవత్సరంలో గృహాలను పున:నిర్మిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, భూకంపాల వల్ల 1.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, ఐదు లక్షల కొత్త గృహాలు అవసరమని యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంచనా వేసింది.