CM Jagan Released YCP Manifesto : వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని అన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారి దగ్గర మ్యానిఫెస్టో ఉందని, మ్యానిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించామని, ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏంఏం చేశామన్నది ప్రజలకు వివరించామని జగన్ చెప్పారు. కరోనా కాలంలోనూ మ్యానిఫెస్టో అమలు చేశామని, మ్యానిఫెస్టో అమలుకు కరోనా కాలంలో ఎలాంటి సాకులు చూపలేదని జగన్ అన్నారు. గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పామని అన్నారు. ఐదేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. రూ. 2లక్షల 70కోట్లను డీబీటీ ద్వారా అందించామని అన్నారు.
Also Read : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు
2014లో కూటమికి ఓటు వేసినందుకు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కూటమిగా ఏర్పడి ఇచ్చిన హామీలను అమలు చేశారా? రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలపై కూటమి ఇచ్చిన హామీలేమయ్యాయి? అని జగన్ ప్రశ్నించారు. సింగపూర్ ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.. ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్నికూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు గతంలో వెటకారంగా మాట్లాడాడంటూ జగన్ గుర్తు చేశారు. చనిపోయిన తరువాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలని జగన్ అన్నారు.
Also Read : 10Tv Conclave : అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
సామాజిక న్యాయం అన్నదానికి అర్ధం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపిన పాలన ఐదేళ్ల కాలంలో జరిగిందని జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు.. మ్యానిఫెస్టోలో పొందుపర్చని హామీలనుసైతం ఐదేళ్ల కాలంలో అమలు చేయడం జరిగిందని చెప్పారు. పిల్లలకు ట్యాబ్స్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి పథకాలు మ్యానిఫెస్టోలో లేవని, ఇలాంటివి అనేకం అమలు చేశామని జగన్ చెప్పారు. అబద్దాలతో చంద్రబాబుతో పోటీపడలేనని.. చేయగిలిగేవి మాత్రమే నేను చెబుతానని.. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా మ్యానిఫెస్టోలో లేనివికూడా అమలు చేస్తామని జగన్ చెప్పారు. ప్రతీ పేవాడి అభివృద్ధి కోసం జగన్ అడుగులు వేస్తాడని, ఆ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పేదవాడికి మేలుచేసే విషయంలో జగన్ కంటే చంద్రాబుకు కాదుకదా.. మరెవరూ చేయలేరని చెప్పగలుగుతానని జగన్ అన్నారు.
Also Read : 10Tv Conclave : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్