IIT Hyderabad : కరోనా ఉధృతి ఇంకా కంటిన్యూ అవుతోంది. దేశంలో లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో..పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని..సెలబ్రెటీలు, ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.
పార్లమెంట్, పలు పార్టీల కార్యాలయాల్లో ఉన్న వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా…ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) లో కరోనా కలకలం రేగింది. మొత్తం 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఇందులో స్టాప్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలో వీరిని ఉంచడం జరిగిందని, ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
Read More : Warangal Rains : వరంగల్ను ముంచెత్తిన వాన-లోతట్టు ప్రాంతాలు జలమయం
మరోవైపు దేశంలో 2022, జనవరి 11వ తేదీ మంగళవారం కొత్తగా 1,94,720 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 442 మంది కోవిడ్ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 9,55,319కి చేరింది. దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. తాను ఏమీ తక్కువ తినలేదంటూ..ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. మంగళవారం 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1281 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్ధాన్ 645, ఢిల్లీలో 546 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.