Benda Farming
Ladies Finger Planting : కాలానుగుణంగా ఏడాది పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలే, ఇందుకు ప్రత్యక్ష ఊదాహరణ. కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా.. స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంట మాత్రం బెండ. అందుకే వేసవిలో నీటి వసతి కింద సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ రైతు.
READ ALSO : Ownership in Okra : బెండలో మేలైన ఎరువుల యాజమాన్యం
ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మర్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ.
చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం . అందుకే వరంగల్ రూరల్ జిల్లా, గీసుకొండ మండలం, ఎలుకుర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు… వరితో పాటు 2 ఎకరాల్లో బెండను సాగుచేపట్టారు. ప్రస్తుతం బెండ తోట వయస్సు 50 రోజులు ఇప్పటికే రెండు కోతలు కోసిన రైతు.. మార్కెట్ లో అధిక ధర పలుకుతుండటంతో ఇతర పంటలతో పోల్చితే బెండసాగు లాభదాయకంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : ladies finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2 రోజులకు ఒక కోతచొప్పున కోయాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైన కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. మొదటి రెండు మూడు కోతలు తక్కువ దిగుబడి వచ్చినా.. నాలుగవ కోతనుండి ప్రతి కోతలోను ఎకరాకు 4 – 5 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది.
పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-5 నెలల వరకు పంటకాలం పొడిగించి, అధిక దిగుబడి పొందవచ్చు. వేసవి కాలం కాబట్టి హోల్ సేల్ మార్కెట్ లో బెండ ధర కిలో 30 రూపాయలు పలుకుతోంది. ఇప్పటికే రెండు కోతలు కోసిన రైతు రాజు విత్తన పెట్టుబడి వచ్చేసిందని చెబుతున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే ఎకరాకు తక్కువలో తక్కువ లక్షరూపాయల నికర ఆదాయం ఎటూ పోదంటున్నారు.
ఈ రైతు సాగు విధానాన్ని గమనించి సాటి రైతులు కూడా ప్రధాన పంటతో పాటు కొద్దిపాటి విస్తీర్ణంలో కూరగాయల సాగుచేపడితే.. వీటిపై వచ్చే ఆదాయం ప్రధాన పంటలకు పెట్టుబడి ఉపయోగపడటమే కాకుండా రైతు వారి ఖర్చులు కూడా వెల్లే అవకాశం ఉంది.