Delhi Rozgar Budget 2022 : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టింది. మార్చి 26 (శనివారం) ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిదో బడ్జెట్ను సమర్పించింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధికమంత్రి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పెషల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అన్ని ప్రభుత్వాలు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్లపై ఫోకస్ చేస్తుంటే.. ఆప్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ బడ్డెట్నే ప్రవేశపెట్టింది. సాధారణ బడ్జెట్లోనే ఉద్యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ ప్రవేశపెట్టింది. 2022-23 ఏడాదికి రూ.75,800 కోట్ల బడ్జెట్ను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సమర్పించారు.
2014-15లో రూ.30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కన్నా రెండున్నర రెట్లు అధికంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీకి ఈ ఏడాది బడ్జెట్ను ‘ఉపాధి బడ్జెట్’ (Rozgar Budget)గా సిసోడియా అభివర్ణించారు. తద్వారా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ముందుకు సాగనుంది. అసెంబ్లీలో మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పరిమాణం మునుపటి ఏడాది కన్నా రూ.69,000 కోట్లకు కంటే 9.86 శాతం ఎక్కువకు పెరిగిందన్నారు. కోవిడ్-19 ప్రభావం నుంచి ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని మంత్రి సిసోడియా అన్నారు.
ఈ ఉపాధి బడ్జెట్ ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో తీసుకెళ్తుందని ఆయన ఆకాంక్షించారు. లక్షలాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి సిసోడియా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సొసోడియా ఉపాధి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలియజేశారు. ఈ బడ్జెట్ యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఢిల్లీలోని ప్రతి వర్గాన్ని ఆదుకున్నామని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో చేసిన ట్వీట్లో.. ‘2022-23 బడ్జెట్లో, హీత్ రంగానికి రూ. 9,669 కోట్లు కేటాయించగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం విద్య కోసం రూ. 16,278 కోట్లు కేటాయించింది’ అని కేజ్రీవాల్ చెప్పారు.
వరుసగా 8వ బడ్జెట్.. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం..
వరుసగా ఎనిమిదో సంవత్సరం బడ్జెట్ను సమర్పిస్తూ.. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు నగర ప్రభుత్వం రూ. 4,500 కోట్లు ఖర్చు చేస్తుందని, 2022లో రూ. 800 కోట్లు కేటాయించనున్నట్లు సిసోడియా పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 7 బడ్జెట్లు ఢిల్లీ పాఠశాలలను మెరుగుపరిచాయని సిసోడియా తెలిపారు. అందరికీ కరెంటు అందుబాటులోకి తెచ్చామని, కరెంటు బిల్లులు తగ్గడంతో పాటు మెట్రోను కూడా విస్తరించామన్నారు. ఇకపై ఢిల్లీ ప్రజలు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. గత ఏడేళ్లలో ఆప్ ప్రభుత్వం లక్షా 78 వేల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించిందని మనీష్ సిసోడియా వెల్లడించారు.
ఢిల్లీలోని యువకులకు, ముఖ్యంగా మహిళలకు ప్రతి ఏడాదిలో కనీసం లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కృత్రిమ మేధ ఆధారిత వెబ్సైట్ మొబైల్ అప్లికేషన్ “Rozgar Bazaar 2.0” లాంచ్ చేయనున్నట్టు సిసోడియా పేర్కొన్నారు. పెద్ద ఐటి కంపెనీలను ఆకర్షించడం ద్వారా 80వేల ఉద్యోగాలను సృష్టించేందుకు బాప్రోలాలో ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేకాదు.. ఫుడ్ ట్రాకింగ్ పాలసీ(food truck policy)ని కూడా ప్రవేశపెడతామని అన్నారు. ఈ ఫుడ్ పాలసీ కింద స్థానిక రుచికరమైన వంటకాలను ప్రమోట్ చేస్తామని సిసోడియా చెప్పారు. ఈ ఫుడ్ ట్రక్కులు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వీధుల్లో అనుమతించనున్నట్టు తెలిపారు. తద్వారా ఢిల్లీ రాజధానిలో రాత్రి సమయంలోనూ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగనున్నట్టు సొసోడియా వెల్లడించారు. నగరంలో రిటైల్ హోల్సేల్ మార్కెట్లను ప్రోత్సహించడానికి షాపింగ్ ఫెస్టివల్స్ను కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్వహించనుంది.
Read Also : The Kashmir Files: అంతగా చూడాల్సిన సినిమా అయితే ఉచితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి: అరవింద్ కేజ్రీవాల్