Huzurabad By Election : ఈటలకు చావోరేవో..బీజేపీ గెలుస్తుందా ?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక.. ఈటల రాజేందర్‌కు చావోరేవోలా తయారైంది. అందుకే ఆయన గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

Etela Rajender Huzurabad : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక.. ఈటల రాజేందర్‌కు చావోరేవోలా తయారైంది. అందుకే ఆయన గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి.. కేసీఆర్‌ అహంకారానికి జరుగుతున్న ఎన్నికలంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు పేలుస్తున్నారు. తన రాజీనామా వల్లే… హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పథకాలన్నీ అమలవుతున్నాయని పదేపదే గుర్తు చేస్తున్నారు. తనకు భయపడే ప్రభుత్వం ఆగమేఘాల మీద నిధులు మంజూరు చేస్తోందని జనానికి చెప్పుకొస్తున్నారు.

Read More : Huzurabad : నామినేషన్ వేయనున్న గెల్లు శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం కేసీఆర్

అంతేకాదు.. తనతో ఢీ అంటున్న టీఆర్‌ఎస్‌ నేతలపైనా నిప్పులు కురిపిస్తున్నారు ఈటల రాజేందర్‌. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సహా ప్రచారంలో పాల్గొంటున్న గులాబీ నేతలందరిపైనా పరుష పదజాలాన్ని వాడేందుకు కూడా వెనుకాడట్లేదు. ఈటల దూకుడుకు బీజేపీ నేతల వ్యూహాలు కూడా కలవడంతో… హుజూరాబాద్‌ కాషాయ దళంలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈటల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం.. అందుకోసం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జ్ ను నియమించగా… ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచించే బాధ్యతల్ని మరో ఇన్‌ఛార్జ్ కు అప్పగించింది. గ్రామగ్రామాన శక్తి కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి ప్రచారం చేసేందుకు ప్రముఖులను నియమించింది.

Read More : Ola Electric పంట పండింది.. మ‌రో 200 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబడులు

ప్రతీ 30మంది ఓటర్లను ఆకర్షించే బాధ్యతను ఒక్కొక్కరికి అప్పగించింది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల్ని సైతం రంగంలోకి దించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూ వాహిని, ఏబీవీపీకి చెందిన ఫుల్‌టైం కార్యకర్తల్ని ఎన్నికల ప్రచారంలో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరంతా సంప్రదాయ ఎన్నికల ప్రచారంలా కాకుండా విడివిడిగా ఓటర్లను కలిసి… బీజేపీ లక్ష్యాలతో పాటు ఈటల రాజేందర్‌కు ఎందుకు ఓటెయ్యాలనే అంశాల్ని వివరించేలా వ్యూహం సిద్ధం చేశారు కమలనాథులు. బండి సంజయ్‌ పాదయాత్ర జోష్‌ను కూడా హుజూరాబాద్‌ వైపు మళ్లించేలా ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు ఈటల రాజేందర్‌కు ఎంత ముఖ్యమో… బీజేపీకి అంతకంటే ఎక్కువ అవసరం. అందుకే ఈటల చరిష్మాకు తమ వ్యూహాలు జోడించి… బైఎలక్షన్‌లో కాషాయ జెండా రెపరెపలాడించాలని ఆరాటపడుతోంది కమలదళం. మరి సక్సెస్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు