Gulab Effect in Hyderabad : భాగ్యనగరానికి గులాబ్ గండం పట్టుకుంది. గులాబ్ తుపాను హైదరాబాద్ను గడగడలాడిస్తోంది. నగరంలో నిన్న కుండపోతగా కురిసిన వర్షం.. ఇవాళ, రేపు కూడా తన ప్రతాపాన్ని చూపనుంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, బీఎన్రెడ్డి నగర్, తుర్కయాంజాల్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పురా, యకుత్పురా తదితర ప్రాంతాల్లోనూ సోమవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాజేంద్రనగర్లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Gulab Effect: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ వాయిదా
భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాదీలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని GHMC అధికారులు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ రెండ్రోజుల పాటు హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలవారిని, పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్ టీమ్లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను సిద్ధంచేశారు. జీహెచ్ఎంసీలో అన్నిస్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా ప్రజలు ఎక్కడపడితే అక్కడ మ్యాన్హోల్ మూతలు తీయొద్దని జలమండలి ఎండీ దానకిషోర్ ప్రజలను కోరారు.
రాగల రెండ్రోజులు భారీ వర్షాలు :
గ్రేటర్ హైదరాబాద్లో రాగల రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. మోస్తరు నుంచి భారీవర్షాలు, భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలవారితోపాటు పురాతన కట్టడాలకు సమీపంలో ఉన్నవారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 30 పునరావాస కేంద్రాలు, 170 మాన్సూన్ టీమ్లు, 92 స్టాటిస్టిక్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో గేట్లను ఎత్తి, మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని బస్తీలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెరువుల కట్టలకు మరమ్మత్తు చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి ముందుజాగ్రత్తగా అక్కడ నివసించేవారిని అప్రమత్తం చేస్తున్నారు. రిజర్వ్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
Gulab Effect : తడిసి ముద్దైన తెలంగాణ.. 14జిల్లాల్లో రెడ్ అలర్ట్..!