Weekend Lockdown,Night Curfew కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలవుతుందని,నైట్ కర్ఫ్యూని స్ట్రిక్ట్ గా అమలుచేయాలని పోలీసులని ఆదేశించినట్లు తెలిపారు. ఇక,మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ విధిస్తామని చెప్పారు. 8 కర్ణాటక సరిహద్దు జిల్లాలు- మైసూర్,చారమాజ్ నగర్,మంగళూరు,కొడగు,బెళగావి,బీదర్,కలబుర్గి,విజయాపుర జిల్లాలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.
ఆరోగ్య,విద్యా నిపుణులు,మంత్రులు,ఇతర ప్రభుత్వ ఉన్నాధికారులతో ఇవాళ కర్ణాటకలో కోవిడ్ పరిస్థితిపై చర్చించిన సీఎం బొమ్మై..రానున్న రోజుల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుదల,తగ్గుదల విషయాలపై జాతీయ స్థాయి నుంచి కొన్ని డైరక్షన్స్ వచ్చినట్లు తెలిపారు. దాని ఆధారంగా తాము ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు. విద్యాసంస్ధలను దశలవారీగా తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. ఆగస్టు 23 నుంచి 9-12వ తరగుల విద్యార్ధుల కోసం స్కూల్స్ రీఓపెన్ చేయబోతున్నట్లు తెలిపారు.
మరోవైపు,ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక,కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా కొత్త ఆంక్షలతో లాక్ డౌన్ ని ఆగస్టు 23 వరకూ పొడిగించింది. శుక్ర,శని,ఆదివారాల్లో అన్ని ప్రార్థనా స్థలాలు మూసివేయబడతాయని స్టాలిన్ సర్కార్ తెలిపింది.