Messi: ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ(Lionel Messi)కి చేదు అనుభవం ఎదురైంది. చైనాకు వెళ్లిన అతడిని విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు పోలీసుల అదుపులో ఉన్నారు. అనంతరం అతడిని తమ దేశంలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
బీజింగ్ వేదికగా వర్కర్స్ స్టేడియంలో జూన్ 15న ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు అర్జెంటీనా కెప్టెన్ అయిన మెస్సీ బీజింగ్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే.. అక్కడ అతడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మెస్సీ తన అర్జెంటీనా పాస్పోర్ట్తో కాకుండా స్పానిష్ పాస్పోర్ట్ను ఉపయోగించాడు. చైనా వీసా లేకపోవడంతో మెస్సీ పాస్పోర్టును తనిఖీ చేసిన అధికారులు అతడిని అడ్డుకున్నారు. తైవాన్లో లాగే చైనాలో ఫ్రీ ఎంట్రీ ఉంటుందని తాను బావించినట్లు అతడు వారితో చెప్పినట్లుగా పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. దాదాపు 30 నిమిషాల తరువాత పరిస్థితి సద్దుమణిగింది. అధికారులు అతడికి ఎమర్జెన్సీ కింద వీసా అందించారు. ఆ తరువాత మెస్సీ ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు.
Rohit Sharma: డబ్ల్యూటీసీ పాయె.. వన్డే ప్రపంచకప్పై రోహిత్ సేన దృష్టి.. ఈ సారి అలా ఆడతారట
Earlier today at the Beijing airport, Leo Messi faced some issues with his passport. pic.twitter.com/rLNwI3W4nJ
— Leo Messi 🔟 Fan Club (@WeAreMessi) June 10, 2023
తన పాస్పోర్టు పట్టుకుని సహచరులతో మాట్లాడుతున్న అర్జెంటీనా జాతీయ జట్టు కెప్టెన్ను పలువురు పోలీసు అధికారులు అడ్డుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం మెస్సీ ఇండోనేషియాతో జూన్ 19 మరో మ్యాచ్ ఆడనున్నాడు. అనంతరం మెస్సీ తన కొత్త కబ్ ఇంటర్ మయామిలో చేరడానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఎట్టకేలకు ఇటీవల మెస్సీ తన కలను నిజం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఖతార్లో ఫ్రాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో, మెస్సీ అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా మరోసారి ఫిఫా ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్తో గోల్డెన్ బాల్ అవార్డు సైతం అందుకున్నాడు. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ కాగా.. మెస్సీకి మొదటిది.