Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేస్తున్న ‘చంద్రయాన్-3’ని వచ్చే ఏడాది జూన్లో ప్రయోగించబోతున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్నాథ్ వెల్లడించారు.
‘జీఎస్ఎల్వీ-3 (జియోసింక్రోనస్ లాంఛ్ వెహికిల్ మార్క్-3)’ ద్వారా చంద్రయాన్-3 చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి చంద్రయాన్-3ని ఈ ఏడాది ఆగష్టులో ప్రయోగించాల్సి ఉంది. అయితే, కోవిడ్ వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీంతో వచ్చే ఏడాది జూన్లో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాల్ని సోమ్నాథ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ‘‘చంద్రయాన్-2కు చంద్రయాన్-3 కి సంబంధం లేదు. ఇది కొత్త నమూనా. దీని నిర్మాణం చాలా కొత్తది. గతంలోలాగా సమస్యలు తలెత్తకుండా మరింత సమర్ధంగా దీన్ని తయారు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మరోవైపు భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ ప్రాజెక్టుపై ఇస్రో పని చేస్తోందన్నారు.
ఈ ప్రాజెక్టును 2024లో చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగా తొలి అబార్ట్ మిషన్ను వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహిస్తామన్నారు. ఇక, ఇంతకుముందు 2019, సెప్టెంబర్లో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా కాకపోవడంతో ఇది విఫలమైంది. అయితే, ఇది ఇప్పటికీ చంద్రుడిపై పని చేస్తోంది.