Bride Dies Of Cardiac Arrest : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపం పైనే నవ వధువు గుండెపోటుతో మరణించింది. లక్నో శివార్లలోని బడ్వానాలో ఈ ఘటన జరిగింది.
Also Read.. Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్
బడ్వానా గ్రామానికి చెందిన రాజ్ పాల్ కూతురు శివంగి (20)కి, అదే గ్రామానికి చెందిన వివేక్ తో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా వధూవరుల కుటుంబాలు మండపానికి చేరుకున్నాయి. అంతా సందడిగా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంపైకి ఎక్కారు. దండలు మార్చుకుంటున్న సమయంలో వధువు శివంగి ఒక్కసారిగా మండపంపైనే కుప్పకూలింది. దీంతో బంధువులు కంగారుపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, గుండెపోటుతో ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో నిర్ధాంతపోయారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.
కళ్ల ముందే పెళ్లి కూతురు గుండెపోటుతో చనిపోవడంతో పెళ్లికి వచ్చిన వారంతా షాక్ తిన్నారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న ఆ మండపంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వధువు, వరుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు.
దేవుడి పాదాలపై తలపెట్టి అలానే మృతి..
మధ్యప్రదేశ్లోని కట్ని పట్టణంలోనూ ఇలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. ఓ వ్యక్తి సాయిబాబా ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెడుతూనే ప్రాణాలు కోల్పోయాడు. దేవుడి విగ్రహం ముందు కూర్చుని తలను దిమ్మెకు ఆన్చి దండం పెట్టాడు. అయితే 15 నిమిషాలు అయినా అతను అలాగే ఉండి పైకి లేవలేదు. దాంతో అనుమానం వచ్చిన తోటి భక్తులు పూజారికి సమాచారం ఇచ్చారు. పూజారి వచ్చి అతడిని కదిలించి చూడగా కుప్పకూలాడు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సైలెంట్ హార్ట్ ఎటాక్ వల్లే అతను ఎలాంటి కదలిక లేకుండా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని డాక్టర్లు చెబుతున్నారు.
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఇలా పలువురు మరణించడం వారి అభిమానులను బాధకు గురిచేసింది.
కాగా, ఇటీవలి కాలంలో అన్ని ఏజ్ గ్రూపుల్లో మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.