ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచులోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు.
మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడారు.. ‘మేం బాగా ప్రారంభించాము.. మంచి భాగస్వామ్యంతో పరుగులు రాబట్టాలని చూశాం. కానీ, వెంటవెంటనే ఔట్ కావడంతో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. మా లక్ష్యం 280 – 290 పరుగులు. ఆ మార్క్ ను మేం చేరుకోలేకపోయాం అని అజామ్ అన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరును అజామ్ ప్రశంసించాడు. ఇదిలాఉంటే పాక్ పై భారత్ విజయంలో మిగిలిన బంతులు 117. బంతుల పరంగా వన్డేల్లో పాక్ పై భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం. మరోవైపు తాజా విజయంతో వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై భారత్ వరుసగా ఎనిమిదో మ్యాచ్ లోనూ విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కలిశాడు. తన సంతకంతో కూడిన రెండు భారత జెర్సీలను కోహ్లీ అజామ్ కు బహుమతిగా అందించాడు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఘటన మ్యాచ్ అనంతరం మైదానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, విరాట్ కోహ్లీ అభిమానుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒకరని తెలిసిన విషయమే. విరాట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడి బ్యాటింగ్ స్టైల్ ను అనుకరిస్తానని గతంలో పలు సందర్భాల్లో బాబర్ చెప్పాడు. ఇదిలాఉంటే కోహ్లీ తన సంతకం చేసిన జెర్సీ పాక్ క్రికెటర్లకు ఇవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఆసియా కప్ 2022 సందర్భంగా పాక్ స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ కు తన జెర్సీని కోహ్లీ గిప్ట్ గా ఇచ్చాడు.
FANBOY MOMENT FOR BABAR AZAM….!!
Babar asks for a signed from Virat Kohli and Virat gives it.pic.twitter.com/Caq3GoQoaV
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023