Gautam Gambhir
Gambhir : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలంటూ కొందరు నెటీజన్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ దేశం ఉగ్రవాదులు మన పైకి ఎగదోస్తుంటే మీరు ఆ దేశంతో మ్యాచులు ఆడడమే కాకుండా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలుకుతారా అంటూ పలువురు మండిపడ్డారు.
దీనిపై గంభీర్ స్పందించాడు. మ్యాచ్లో టాస్ తరువాత స్టార్స్పోర్ట్స్తో గంభీర్ మాట్లాడుతూ.. ప్రపంచకప్లో పాల్గొనేందుకు వచ్చినందున పాకిస్థాన్ జట్టును అగౌరవపరచవద్దని అభిమానులను కోరాడు. ‘ మీ జట్టుకు మద్దతు ఇవ్వండి. కానీ మీ సందర్శకులతో అనుచితంగా ప్రవర్తించవద్దు. వారు మీ అతిథులు. ప్రపంచకప్ ఆడడానికి ఇక్కడ వచ్చారు అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి.’ అని గంభీర్ అన్నాడు.
Virat Kohli : పాకిస్థాన్తో మ్యాచ్లో పెద్ద పొరబాటు చేసిన కోహ్లీ.. ఇలా ఎందుకు చేశావ్..!
పాకిస్థాన్ ఫ్యాన్స్ వీసాలు పొందలేకపోవడంతో నరేంద్ర మోదీ స్టేడియం దాదాపుగా నీలిరంగులో కనిపిస్తోంది. ఈ మ్యాచ్కు దాదాపు 1,20,000 మంది ప్రేక్షకులకు హాజరు అయ్యారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాటర్లలో బాబర్ ఆజాం (50) హాఫ్ సెంచరీ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (49) ఒక్క పరుగు తేడాతో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ (36) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, హార్ధిక్, జడేజా లు తలా రెండు వికెట్లు తీశారు.