Rishabh Pant Could Leave Delhi Capitals Before IPL 2025
Rishabh Pant – Delhi Capitals : ఐపీఎల్లో 17 సీజన్లు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు కప్పు కొట్టని మూడు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఐపీఎల్ 2024 సీజన్లోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలమైంది. ఈ క్రమంలో తమ జట్టులో మార్పులపై ఢిల్లీ యాజమాన్యం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 7 సీజన్ల పాటు హెడ్ కోచ్గా కొనసాగిన పాంటింగ్ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
మెగా వేలానికి ముందు కొత్త కోచ్ను తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే.. ఈ క్రమంలో ఢిల్లీకి మరో షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను వీడే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాంటింగ్, పంత్ మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. పాంటింగ్ను తొలగించడంతో పంత్ అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే మెగా వేలానికి ముందు జట్టును వీడనున్నాడు అని రూమర్లు వస్తున్నాయి. వీటిపై ఇప్పటి వరకు అటు పంత్ గానీ, ఇటు ఢిల్లీ యాజమాన్యం గానీ స్పందించలేదు.
రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్ 2024తోనే పునరాగమనం ఇచ్చాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది. 14 మ్యాచులు ఆడగా 7 మ్యాచుల్లో గెలిచింది. మరో 7 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొత్త కోచింగ్ బృందంలో బరిలోకి దిగాలని భావిస్తోంది. పాంటింగ్ పై వేటు వేయగా అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమ్ డైరెక్టర్గా ఉన్న సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్ పదవి కోసం ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.