CM KCR Chandur Public Meeting: మునుగోడు ఉపఎన్నికలో ప్రచారపర్వం ముగింపు దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలు తమతమ అభ్యర్థుల గెలుపుకోసం ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్లు మునుగోడు ఎన్నికల చిత్రం మారిపోయింది. ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదులు, ఎమ్మెల్యేలకు ఎర అంశంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. చండూరు వేదికగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
KTR On Munugode By Election : వారి చేరికలతో లాభమే, మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం-కేటీఆర్
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలో, మరోవైపు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలుచేయలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే సీఎం ప్రెస్మీట్ పెట్టి మాట్లాడతారని అందరూ భావించినప్పటికీ ఇప్పటి వరకు ఈ విషయంపై కేసీఆర్ పెదవి విప్పలేదు. అయితే, చండూరు వేదికగా జరిగే బహిరంగ సభలో ఈ అంశంపై కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద్దగా ప్రస్తావించడం లేదు. తాజాగా చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రస్తావించి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలిపేలా సీఎం కేసీఆర్ ప్రసంగం సాగే అవకాశాలు ఉంటాయని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి.