MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. ఈ కేసులో కవితను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించిన ఈడీ.. ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు అందించింది. దీంతో మరోసారి కవిత.. ఈడీ అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శనివారం కవిత ఈడీ విచారణ ముగిసింది. సుదీర్ఘంగా ఈ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. సెల్ ఫోన్స్ మార్చడం, ఆధారాల ధ్వంసంపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పారు. కాగా, లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని కవిత ఈడీ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
Also Read.. MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు
విచారణ తర్వాత ఈడీ కార్యాలయం నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి కవిత వెళ్లిపోయారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం శనివారం ఉదయం 11గంటలకు విచారణ ప్రారంభించగా.. 9 గంటల పాటు ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు.
9 గంటల సుదీర్ఘ ఈడీ విచారణ తర్వాత బయటకు వచ్చిన కవిత.. ఈడీ కార్యాలయం బయట తన కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు. కవిత బయటకు రావడాన్ని గమనించిన మీడియా ఆమెను చుట్టుముట్టింది. అయితే, కవిత ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసానికి కవిత వెళ్లారు.
ఢిల్లీలో పరిణామాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. కవిత ఈడీ విచారణ గురించి ఆరా తీశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల నుంచి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. మరోవైపు కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రులు దేశ రాజధానిలోనే మకాం వేశారు.