Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు విచారించిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన నివాసం నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో సమావేశమై, విచారణ జరిగిన తీరును గురించి వివరిస్తున్నారు. సీబీఐ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు? తాను ఏ విధంగా సమాధానాలు చెప్పాను? వంటి అంశాలపై కేసీఆర్ కు కవిత చెబుతున్నారు.
కవితతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను సీబీఐ అధికారులు ఏడున్నర గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. అవసరమైతే మరో రోజు కూడా విచారిస్తామని సీబీఐ అధికారులు చెప్పారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత నుంచి సీబీఐ అధికారులు పలు వివరాలు రాబట్టినట్లు తెలిసింది.
సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయాక అక్కడకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కవిత మీడియాతో మాట్లాడకుండానే ప్రగతి భవన్ కు వెళ్లారు. కాగా, లిక్కర్ స్కాంకు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త అమిత్ అరోరా ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే.
సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్ర సహా కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది. ఇవాళ కవితను సీబీఐ విచారించడంతో టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవితను సీబీఐ విచారించిందని అంటున్నారు.