NIA Raids in Andhra, Telangana: తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, బైంసా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై, ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్ లోని 20 ప్రాంతాల్లో నాలుగు ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
మరోవైపు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మదీనా కాలనీలో పలు ఇళ్లలో కొందరిని అధికారులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మూడు ఇళ్లు, టవర్ సర్కిల్ లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్లో ఒక ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే పలు డైరీలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో ఇలియాజ్ తో పాటు అతడి స్నేహితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మతకలహాలు సృష్టించేందుకు కొందరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది.