Rajkot Fire : గుజరాత్ రాజ్కోట్ అగ్నిప్రమాద ఘటనలో 33కు చేరిన మృతుల సంఖ్య
అగ్నిప్రమాద ఘటన జరిగిన టీఆర్పి గేమ్ జోన్ ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వి పరిశీలించారు.
- Harish Thanniru
- Updated on- May 26, 2024 / 03:02 PM IST
Rajkot Fire
Rajkot Game zone Fire Updates : గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ గేమ్ జోన్ లో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 70 మంది వరకు పిల్లలు అక్కడ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రాజ్ కోట్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.
Also Read : గేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం.. 24మంది దుర్మరణం, మృతుల్లో 12మంది చిన్నారులు
అగ్నిప్రమాద ఘటన జరిగిన టీఆర్పి గేమ్ జోన్ ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్ ను నియమించింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Also Read : Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11మంది భక్తులు మృతి
మరోవైపు గేమింగ్ జోన్ యాజమాని యువరాజ్ సింగ్ సోలంకి, గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడి కావాల్సిన సహాయక చర్యలు చేపట్టాలని, దోషులను శిక్షించాలని మోదీ సూచించారు.
