Nizamabad Bride Suicide Case : మరికొన్ని గంటల్లో పెళ్లి. పెళ్లి కూతురు ముస్తాబైంది. ఒక్కగానొక్క కూతురు వివాహానికి పెద్దలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పచ్చిని పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పెళ్లి కోసం ఫంక్షన్ హాల్ ని బుక్ చేశారు. మరో ఐదారు గంటలైనే బంధువులంతా వచ్చే సమయం. ఇంతలోనే పెళ్లింట ఊహించని విషాదం చోటు చేసుకుంది.
చేతులకు మెహంది, కాళ్లకు పారాణి పెట్టుకున్న నవవధువు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి కొన్ని గంటల ముందు నవవధువు ఆత్మహత్య చేసుకోవడం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నవవధువు మృతితో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కూతురి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తే ఇలా జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే రవళి ఆత్మహత్యకు కాబోయే భర్త వేధింపులే కారణం అని అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. పెళ్లి కుదిరిన దగ్గరి నుంచి రవళిని వరుడు సంతోష్ వేధిస్తున్నట్లు యువతి తండ్రి ఆరోపించారు. రవళి చివరి ఫోన్ కాల్ కాబోయే భర్తతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కకాసేపటికే ప్రాణాలు తీసుకుంది రవళి.
ఆగస్టులో రవళి, సంతోష్ ల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం పెళ్లికి ముహూర్తం కుదుర్చుకుని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్, బంధువులతో రవళి సంతోషంగా గడిపింది. డ్యాన్ కూడా చేసింది. అలా సంతోషంగా గడిపిన తమ కూతురు.. విగతజీవిగా మారడం చూసి యువతి తల్లిదండ్రులు తట్టుకోలేపోతున్నారు. నవవధువు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
రవళిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని.. వరుడితో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. పెళ్లికి ముందే వరుడు సూటిపోటి మాటలతో వేధించాడని, ఆస్తిలో సగం వాటా కావాలని డిమాండ్ చేశాడని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ఉద్యోగం చేయాలని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబోయే పెళ్లి కొడుకు శనివారం రాత్రి తమ కూతురికి ఫోన్ చేశాడని.. అతడు పెట్టిన మానసిక క్షోభతోనే రవళి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో ప్రస్తావించాడు తండ్రి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.