ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం(జూన్ 19,2020) ఉదయం సీఎం జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొలి ఓటు వేశారు. కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
4 స్థానాలకు ఐదుగురి పోటీ:
రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీకి దిగారు. వైసీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఏజెంట్లుగా ఉన్నారు. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్గా ఎమ్మెల్సీ అశోక్బాబును.. పార్టీ తరపున ఏజెంట్గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి గంటలోపు అంటే 6గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు.
* ఏపీలో రాజ్యసభ ఎన్నికలు
* 4 స్థానాలకు ఐదుగురి పోటీ
* వైసీపీ నుంచి బరిలో నలుగురు
* టీడీపీ నుంచి బరిలో ఒకరు(వర్ల రామయ్య)
* విజయానికి ఒక్కో అభ్యర్థికి 38మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం
* టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం 20మంది ఎమ్మెల్యేల బలం
* టీడీపీకి దూరంగా ఎమ్మెల్యేలు కరణం బలరామ్, వల్లభనేని వంశీ, మద్దాల గిరిధిర్
* ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన టీడీపీ