Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా నిరాధార ఆరోపణలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పాలన అంతా పారదర్శకంగా కొనసాగిందని చెప్పారు.
ఇవాళ అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఐదేళ్లుగా వైసీపీ సర్కారు అమలు చేసిన ప్రతి పథకానికి లెక్కలు ఉన్నాయని చెప్పారు. 2014-19 మధ్యలోనే ఏపీలో అవినీతి జరిగిందని, అందులో బీజేపీకి కూడా వాటా ఉందని ఆరోపించారు.
పొలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను అమిత్ షా మర్చిపోయారా అని సజ్జల ప్రశ్నించారు. పోలవరంలో కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రత్యేక హోదాను వదిలేశారని చెప్పారు. ఆయన తప్పిదాల వల్లే డయా ఫ్రం వాల్ కొట్టుకుని పోయిందని అన్నారు.
పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నాయుడే కారణమని సజ్జల తెలిపారు. ఏపీలో మళ్లీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తేనే పోలవరం పూర్తి అవుతుందని ప్రజలకు తెలుసని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం ధనవంతులకే అనే పరిస్థితి లేకుండా పేద పిల్లలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెస్తున్నాం అని గర్వంగా చెబుతున్నానని సజ్జల అన్నారు. నిజాయితీ పరులకు మాత్రమే ఈ యాక్ట్ నచ్చుతుందని చెప్పారు. భూ కబ్జాలు, మాఫీయా చేసే వాళ్లకి మాత్రం ఈ చట్టం నచ్చదని అన్నారు. సీఐడీ కేసు నమోదు మంచి పరిణామమని తెలిపారు.
Also Read: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ