ల్యాండ్ టైటలింగ్ యాక్ట్పై విష ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భూములు దోచేస్తారని దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు.
భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుందని సజ్జల అన్నారు. అసలు ఈ చట్టం ఇంకా అమలులోకి రాలేదని తెలిపారు. అది ఇంకా పరిశీలనలోనే ఉందని తెలిపారు. ఇది అమలు కావాలంటే సమగ్ర భూ సర్వే జరగాలని చెప్పారు.
ప్రస్తుతం భూ సర్వే జరుగుతోందని సజ్జల తెలిపారు. అది పూర్తి అయ్యాక ఆ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆరోపించారు. అప్పట్లో సీఆర్డీఏ అసైన్డ్ భూములను కూడా దోచేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు చేసిన ల్యాండ్ స్కాంపై విచారణ జరుగుతోందని తెలిపారు.
ఈ యాక్ట్ తో చంద్రబాబు అరాచకాలు బయటపడతాయని, అందుకే ఆయన భయపడుతున్నారని చెప్పారు. యాక్ట్ పగడ్బందీగా ఉంటుందని, అందుకే చంద్రబాబుకి నచ్చడం లేదని తెలిపారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫొటో వేయించుకోలేదా అని నిలదీశారు. సీఎం జగన్ ఫొటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని తెలిపారు. చంద్రబాబుకి నచ్చకపోతే ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.
Also Read: 2 రోజులుగా కనపడకుండాపోయిన కాంగ్రెస్ నేత.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు