టైటిల్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారా. హెయిర్ కటింగ్ కు ఆధార్ అడగటం ఏంటని విస్తుపోతున్నారా. కానీ ఇది నిజం. హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా, షేవింగ్
టైటిల్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారా. హెయిర్ కటింగ్ కు ఆధార్ అడగటం ఏంటని విస్తుపోతున్నారా. కానీ ఇది నిజం. హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా, షేవింగ్ చేయించుకోవాలన్నా ఆధార్ మస్ట్. అయితే ఈ రూల్ మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రూల్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం.. మరీ ముఖ్యంగా కొన్ని సెలూన్ షాపుల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో
సర్కార్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ జిరాక్స్, అడ్రస్, ఫోన్ నెంబర్ మస్ట్:
లాక్డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా అన్ని షాపులతో పాటు సెలూన్ షాపులూ తెరుచుకున్నాయి. అయితే కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెలూన్ల నిర్వాహకులు. కటింగ్ చేయడంతో పాటు.. వారి విరాలను కూడా నమోదు చేసుకుంటున్నారు. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ లాంటివి సేకరిస్తున్నారు. ఇది చాలదని భావించిన తమిళనాడు ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. కటింగ్ కోసం వచ్చే కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ లేదా నెంబర్ తీసుకోవాలని ఆదేశించింది. దాంతో పాటు ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా సేకరించాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించని సెలూన్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక, బ్యూటీ పార్లర్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
కటింగ్ చేయించుకోవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలి:
చెన్నైలో హెయిర్ కట్ చేయించుకోవాలనుకునే వారు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. మాస్క్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. 50 శాతం ఉద్యోగులతోనే షాప్ నిర్వహించాలని ఆదేశించారు. కస్టమర్లు రాగానే ముందుగా వారి చేతులను శానిటైజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన చర్యలతో సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్ వ్యాప్తి చెందితే ఆ షాపునకు వచ్చిన వారిని గుర్తించడం ఈజీ అవుతుందని అధికారులు వివరించారు. ఆధార్ వివరాల ద్వారా బాధితులను వెంటనే గుర్తించి.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడే:
తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 23 వేల 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 184 మంది చనిపోయారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలో లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ను జూన్ 30 వరకు పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. ఈ క్రమంలో సుమారు 2 నెలల తర్వాత పలు షాపులు తెరుచుకున్నాయి. ఇందులో సెలూన్ (కటింగ్) షాపులు, బ్యూటీ పార్లర్లు కూడా ఉన్నాయి. అయితే.. ప్రభుత్వం వీటికి కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది. ఇకపై సెలూన్లకు వచ్చే వారికి ఆధార్ తప్పనిసరి చేసింది. కనిపించని మాయదారి కరోనా.. ఎలా వస్తుందో తెలియదు? ఎవరి నుంచి అంటుకుంటుందో తెలియదు.. ఒకవేళ.. అనుకోని ఘటన జరిగితే.. వెంటనే గుర్తించడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. మొత్తంగా కరోనా దెబ్బకి చాలా మార్పులే వస్తున్నాయి. ఇంకా ఎన్ని మార్పులు చూడాల్సి వస్తుందో అంటున్నారు జనాలు.
Read: జాక్ పాట్ : APPLE లో మిస్టెక్ కనిపెట్టిన టెకీకి భారీ బహుమతి