Chandrababu Naidu
Chandrababu Naidu – TDP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రాళ్లు, ఇతర వస్తువులు తగలకుండా భద్రతా సిబ్బంది అడ్డుగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) అన్నమయ్య జిల్లా (Annamayya district) కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.
టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ వ్యానును కొందరు ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. ఆ సమయంలో చంద్రబాబుకి రాళ్లు తగలకుండా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను బాంబులకే భయపడలేదని, రాళ్లకు భయపడతానా అని అన్నారు. వైసీపీ ఆటలు ఇక సాగవని చెప్పారు. ఇవాళ ఇక్కడ జరిగిన విధ్వంసంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సమీప భవిష్యత్తులోనే వైసీపీని తరిమికొడతామని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ లేకుండా ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెబుతారన్న భయంతోనే ఆ పార్టీ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతోందని అన్నారు.