Pawan Kalyan : కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను అని పవన్ తేల్చి చెప్పారు. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే ఒప్పందాలు ఉంటాయని స్పష్టం చేశారు. అవమానపడి, గింజుకునే స్థాయిలో ఒప్పందాలు ఉండవన్నారు పవన్.
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు జనసేనాని. మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు పవన్. వెయ్యి కోట్లు ఆఫర్ అని ఒకరంటారు.. వెయ్యి కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపలేము అన్నారు పవన్. సీఎం కుటుంబం దగ్గరున్న మైన్స్ బలిజలకు చెందినవే.. కానీ పోటీ తట్టుకోలేక వెనుకపడ్డారని పవన్ అన్నారు.
”కోస్తాలో కాపులు గొంతెత్తగలరు.. కానీ సీమలో బలిజలు గొంతెత్తే పరిస్థితి లేదు. నువ్వెంత ఎదిగినా నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్ ది. మనల్ని వెన్నుపోటు పొడిచే వారు ఎవరో ఉండరు. మనతో ఉన్న వాళ్లే ఉంటారు. నేను ఓడిపోతే మీసాలు మెలేసి తొడగొట్టింది కాపులే.
నేను ఓడిపోతే మీకేంటీ ఆనందం? నన్ను బీసీ, ఎస్సీ, కాపులతో తిట్టిస్తారు. కానీ మిగిలిన వాళ్లు ఎందుకు తిట్టరు..? వాళ్లు మంచి వాళ్లుగా ఉండాలి.
మనలో మనం కొట్టుకోవాలి.. ఇదే వాళ్ల వ్యూహం. దీన్ని గుర్తించినంత వరకు రాజ్యాధికారం దక్కదు. కాపులు, బీసీలు సంఘాలుగా విడిపోయాయి. కాపులు పెద్దన్న పాత్ర పోషించి బీసీ, ఎస్సీలను కలుపుకుని వెళ్లాలి. రెడ్డి, కమ్మ వర్గాలతో గొడవలు పెట్టుకోకూడదు. ద్వేషించొద్దు. అగ్ర వర్ణాలను గౌరవించడమంటే లొంగిపోయినట్టు కాదు” అని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.