Tirumala Leopard Attack (Photo : Google)
Tirumala Leopard Attack : హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుత కలకలం రేపింది. ఐదేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది చిరుత. నడకమార్గం 7వ మైలు వద్ద ఈ ఘటన జరిగింది. సడెన్ గా వచ్చిన చిరుత.. ఐదు సంవత్సరాల బాలుడిని ఎత్తుకెళ్లాలని చూసింది.
ఇది గమనించిన సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులు గట్టిగా అరిచారు. దాంతో భయపడిన చిరుత.. బాలుడిని వదిలేసి వెళ్లిపోయింది. చిరుత దాడిలో గాయాలపాలైన బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నడకమార్గంలో బాలుడిపై చిరుత దాడి ఘటన భక్తుల్లో తీవ్ర భయాందోళన నింపింది.
చిరుత.. బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. భక్తులు, పోలీసులు గట్టిగా అరవడంతో.. బాలుడిని వదిలేసి చిరుత అడవిలోకి పారిపోయింది. ఈ క్రమంలో బాబుకి స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్ లో తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి బాలుడిని తరలించి చికిత్స అందించారు. బాలుడిపై చిరుత దాడికి యత్నించిన ఘటనతో బాలుడి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. ఇంకా అందులోంచి వారు తేరుకోలేదు. అయితే, బాబు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఎటువైపు నుంచి మళ్లీ చిరుత వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనలో అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసుల పహారా పెంచారు. మరోవైపు భక్తులకు పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు టీటీడీ అధికారులు. రాత్రి వేళల్లో ఒంటరిగా రావొద్దన్నారు. గుంపులు గుంపులుగానే రావాలని భక్తులను కోరారు. వీలైనంత వరకు రాత్రి పూట నడకమార్గాన్ని మాత్రం ప్రిఫర్ చేయొద్దని సూచించారు.
ఇటీవలి కాలంలో తిరుమలలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఎప్పుడు ఎటువైపు నుంచి అవి దాడి చేస్తాయోనని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు భయపడినట్లుగానే ఇవాళ సడెన్ గా వచ్చిన చిరుత.. ఐదేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.