Gudivada Amarnath – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ కోతిలా గెంతుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై అప్పటి మంత్రులే ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అక్రమాలపై పవన్ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.
రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, వెల్ నెస్ సెంటర్లు కొండపై ఉన్నాయని, వాటిని పవన్ కల్యాణ్ ఎందుకు తప్పుపట్టడం లేదని నిలదీశారు. ‘మీ డాడీ చంద్రబాబు రాజగురువు రామోజీ స్టూడియో కొండలపై కట్టలేదా? చిరంజీవి జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఎక్కడ కట్టారు’ అని ప్రశ్నించారు. రుషికొండలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం కోసం అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంచాయితీ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల వెరిఫికేషన్
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆయనలో విషం, విద్వేషం కనిపించాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రుషికొండలో ఏపీటీడీసీ స్థలంలో ప్రభుత్వ నిర్మాణంపై ప్రశ్నించే పవన్ ఒక్కసారి ఎదురుగా ఉన్న గీతం యూనివర్సిటీని చూసి ఉంటే బాగుండేదన్నారు. గీతం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున జరిగిన భూ కబ్జాను కనీసం పట్టించు కోలేదని విమర్శించారు.
ఏపీలో 175 సీట్లకు పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెప్పరని తెలిపారు. చంద్రబాబు బీచ్ ర్యాలీ, విసన్న పేటలో కలిసి తిరిగొచ్చు కదా, వేర్వేరుగా ఎందుకు తిరగడమని పేర్కొన్నారు. చంద్రబాబు కరకట్టపై నిర్మాణం చేపట్టవచ్చు కానీ, అన్ని అనుమతులతో నిర్మాణం చేపడితే ఎందుకు రాద్దాంతం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, రామోజీ రావుకు మించిన స్టువర్టుపురం గ్యాంగ్ ఎవ్వరిని అంటారని అడిగారు.
TTD Alert : చిరుత దాడి ఘటనతో టీటీడీ అలర్ట్.. తిరుమల నడక మార్గంలో భద్రత కట్టుదిట్టం
పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటే పవన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. గాజువాక ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా గాజువాకలోనే ఉంటానని చెప్పిన మాటను పవన్ మర్చి పోయారని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖకు సీఎం జగన్ రావడానికి మూడు రాజధానుల బిల్లు పెటాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి అయినా పాలన చేయవచ్చని తెలిపారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పాలన చేస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ విస్సన్నపేట సందర్శిస్తే తమకు అభ్యంతరం లేదు, రైతులు అడ్డుకుంటే సంబంధం లేదన్నారు.