East Godavari Road Accident (Photo : Google)
East Godavari Road Accident : ఏపీలో రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు యువకులు మృతి చెందారు. పెట్రోల్ బంక్ ఫ్లై ఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుండి వేగంగా వచ్చిన మోటార్ బైక్ బలంగా ఢీకొంది. దాంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు చనిపోయారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతులను దేవరపల్లి మండలంలోని చిన్నాయగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రాఫిక్స్ రూల్స్ ప్రకారం బైక్ పై ముగ్గురు వెళ్లడం నేరం. కానీ, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే బైక్ నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి అనే నిబంధన ఉంది. అది కూడా ఎవరూ పాటించడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలకు ప్రమాదం తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.