Yarlagadda Venkata Rao: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుతో పలు విషయాలపై యార్లగడ్డ చర్చించారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అంశంపై చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే, గన్నవరం లేదా మరో నియోజకవర్గంలోనైనా టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు టీడీపీ అధినేత హామీ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. టీడీపీలో చేరడానికి చంద్రబాబు సమ్మతి తెలిపినట్లు చెప్పారు. ఈనెల 22న యువనేత నారా లోకేశ్ సమక్షంలో అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు యార్లగడ్డ తెలిపారు.
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీడీపీలో చేరిన తరువాత పార్టీ అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. నా పరిస్థితి మొత్తం చంద్రబాబుతో వివరించా.. మీతో కలిసి పనిచేస్తానని చెప్పానని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, గన్నవరం కాకపోయినా పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేస్తానని, పార్టీ అవసరం అనుకుంటే గుడివాడ నియోజకవర్గం నుంచిసైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెంకట్రావు తెలిపారు.
Yarlagadda Venkatarao : చంద్రబాబుతో భేటీ కానున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో చేరనున్న యార్లగడ్డ
రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించాలని రాలేదు, పదవుల కోసం రాలేదని అన్నారు. హైదరాబాద్ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి చేశారు. చంద్రబాబును నేను ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. వైసీపీలో కష్టపడి పనిచేశా. ఎంత మంచి చేసినా వైసీపీ నన్ను గుర్తించలేదు. వైసీపీ నేతల్లో సజ్జల అంటే నాకు చాలా గౌరవం ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.