Chandrababu Kuppam Tour Tention tention : చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటానికి వైసీపీ కార్యకర్తలు పెను విధ్వంసం సృష్టిస్తున్నారు.టీడీపీ ఫ్లెక్సీలు చించివేయటమేకాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ కార్యకర్తల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కవరేజ్ చేస్తున్న 10టీవీ రిపోర్టర్ పై కూడా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితుల మధ్య కుప్పం రణరంగంగా మారింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ముందే ప్రకటించిన వైసీపీ శ్రేణులు.. పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా వైసీపీ కార్యకర్తలు తోసిపడేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయినా పోలీసుల చోద్యం చూస్తు నిలబడ్డారు తప్ప అడ్డుకోలేదు.
సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. చంద్రబాబు టూర్ ను అడ్డుకొంటామని వైసీపీ నేతలు ప్రకటించటమేకాదు బంద్కు కూడా పిలుపునిచ్చారు. వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా నిరసనలకు సిద్దమవ్వడంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన వైసీపీ శ్రేణులు.. పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. వైసీపీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ప్యాలెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ వద్ద ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసి హంగామా సృష్టించారు.
అన్న క్యాంటీన్ వద్దకు భారీగా చేరుకుని.. ఈలలు, కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గూండాల్లా వ్యవహరిస్తున్న వైసీపీ కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్న అడ్డుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ కార్యకర్తల తీరుపై టీడీపీ నేతలుతీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శించారు.శాంతి భద్రతలతో ఉండే కుప్పాన్ని రణరంగంగా మార్చిన ఘనత జగన్ దేనని..కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు పర్యటనను నిలిపివేయాలను భాగంలోనే ఇదంతా చేస్తున్నారంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ డైరెక్షన్ లోనే కుప్పంలో విధ్వంసానికి వైసీపీ కార్యకర్తలు పాల్పడ్డారని ఆరోపించారు.